వెండితెర దైవంగా నీరాజనాలు అందుకున్న ఘనత ఎన్టీఆర్ కి మాత్రమే దక్కింది. పౌరాణిక పాత్రల్లో రాముడిగా ... కృష్ణుడిగా ... వెంకటేశ్వరస్వామిగా ఆయన ఆవిష్కరించిన నవరసనటనా వైభవమే ఆయనకి అంతటి పేరు ప్రతిష్టలను తెచ్చి పెట్టింది. దేవుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు కాబట్టి ఇలా ఉంటాడని అందరూ అనుకునేలా ఆ పాత్రల్లో ఎన్టీఆర్ ఒదిగిపోయారు. ఫలితంగా ఆ పాత్రలు అశేష ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేశాయి. 1960 లో 'శ్రీ వెంకటేశ్వర మహత్యం' సినిమా విడుదలైనప్పుడు అందరూ ఎన్టీఆర్ లోనే ఆ ఏడుకొండలవాడిని చూసుకుని మురిసిపోయారు. ఫలితంగా ఈ సినిమా ప్రదర్శితమైన థియేటర్లు దేవాలయాలుగా మారిపోయాయట.
ప్రేక్షకుల పరవశాన్ని చూసిన యాజమాన్యం ప్రతి థియేటర్ ప్రాంగణంలో ఓ వెంకటేశ్వరస్వామి విగ్రహం చొప్పున ఏర్పాటు చేశారు. దాంతో సినిమా చూడటానికి వచ్చిన వాళ్లు అక్కడ కొబ్బరి కాయలు కొట్టి ... హారతులు ఇచ్చి ... చెప్పులు బయటే విడిచి లోపలికి వెళ్లేవారు. థియేటర్ ప్రాంగణంలో ఉంచిన విగ్రహం దగ్గర ప్రేక్షకులు కానుకలు కూడా ఉంచుతుండటంతో, తిరుమల తిరుపతి దేవస్థానంవారు రద్దీగా ఉండే థియేటర్ల దగ్గర హుండీలు ఏర్పాటు చేశారు. అలా పెట్టిన ఆ హుండీల ద్వారా 46 వేల రూపాయలు రావడంతో, దర్శక నిర్మాత అయిన పి.పుల్లయ్య మరో నాలుగువేల రూపాయలను కలిపి మొత్తం 50 వేల రూపాయలను తిరుమల తిరుపతి దేవాలయానికి విరాళంగా ఇచ్చారట.
Thanks&Regards
Madhu karumudi.